ఎన్డీయే వైఫల్యానికి ఇది నిదర్శనం: ప్రియాంకా గాంధీ
- మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు
- ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన పెద్ద విజయమని వ్యాఖ్య
- ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్న ప్రియాంక
లోక్సభలో మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు వీగిపోవడాన్ని ఆమె ప్రజాస్వామ్యానికి దక్కిన అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు అసలు మహిళల హక్కుల కోసమో లేదా డీలిమిటేషన్ కోసమో తెచ్చింది కాదని ఆమె విమర్శించారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ వ్యూహాన్ని తిప్పికొట్టాయని, తద్వారా లోక్సభలో అధికార పక్షాన్ని ఓడించగలిగామని ఆమె పేర్కొన్నారు.
ఎన్డీయే ప్రభుత్వానికి ఇది ఒక 'చీకటి రోజు' అని ప్రియాంక వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక కీలక బిల్లు లోక్సభలో ఓడిపోవడం ఇదే తొలిసారి అని, ఇది వారి వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ క్రీడను ప్రజలు గమనిస్తున్నారని, విపక్షాల ఐక్యత ఈ ఓటమి ద్వారా స్పష్టమైందని ఆమె పునరుద్ఘాటించారు.